వేడి సమోసా అడిగినందుకు డ్రైనేజీ శుభ్రం చేయించారు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో, నిత్యావసరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొంతమంది యువత అయితే హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. అధికారుల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో ఆ యువతకు కూడా అధికారులు తగిన శిక్ష విధిస్తున్నారు. 


రాంపూర్‌ జిల్లా యంత్రాంగం రెండు రోజుల వ్యవధిలో అనేక ఫోన్‌కాల్స్‌ను స్వీకరించింది. ఓ వ్యక్తి అయితే హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి తనకు వేడి వేడి సమోసా కావాలని పలుమార్లు వేధించాడు. దీంతో అతనికి వేడి సమోసా డెలివరీ చేశారు అధికారులు. ఆ తర్వాత అతన్ని పట్టుకొచ్చి డ్రైనేజీ శుభ్రం చేయించారు. అధికారుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ శిక్ష విధించినట్లు రాంపూర్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ తెలిపారు. పిజ్జా కావాలని ఫోన్‌ చేసిన వ్యక్తికి ఇదే శిక్ష విధించారు. కొందరైతే తమకు పాన్‌ కావాలని ఫోన్‌ చేసి వేధించారు. అనవసరమైన కాల్స్‌ చేసి అధికారుల సమయాన్ని వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాంపూర్‌ డీఎం కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.